స్టాక్ మార్కెట్లలో యుద్ధ ప్రళయం.. సెన్సెక్స్ భారీ పతనం

by Malleboina Mahesh |   (  Updated:2026-03-02 05:53:24  IST  )

స్టాక్ మార్కెట్‌లో యుద్ధ ప్రళయం! ఒకే రోజు 3,000 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ముడి చమురు సెగతో విలవిలలాడుతున్న మార్కెట్లు. సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్ల చూపు!

స్టాక్ మార్కెట్లలో యుద్ధ ప్రళయం.. సెన్సెక్స్ భారీ పతనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఆరబ్ కంట్రీస్ పై ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చంది. దీంతో ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ సుమారు 3,000 పాయింట్లు పతనమవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కీలకమైన 25,000 మార్కు కంటే దిగువకు పడిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, అమెరికా-గల్ఫ్ దేశాల ఉమ్మడి సైనిక హెచ్చరికలు ఇన్వెస్టర్లలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో మార్కెట్లో భారీగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

చమురు మంటలు - ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

ఈ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందనే భయంతో ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా 10% పైగా పెరిగాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఏవియేషన్, పెయింట్స్, టైర్, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. కేవలం ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి కావడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

సురక్షిత పెట్టుబడుల వైపు చూపు

యుద్ధ పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్లు అస్థిరంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను షేర్ల నుండి ఉపసంహరించుకుని సురక్షితమైన బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) కూడా భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేత. ఇరాన్ ప్రతీకార చర్యలపై స్పష్టత వచ్చే వరకు మార్కెట్లు ఇలాగే ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

స్టాక్ మార్కెట్లు భారీ పతనం.. రూ. 7.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి!

Next Story