అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత

by Ratna Kumari |

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పోలీసులు పట్టుకుని 11 పశువులను రక్షించారు.

అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనం పట్టివేత
X

దిశ, చౌటుప్పల్ టౌన్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పోలీసులు పట్టుకుని 11 పశువులను రక్షించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జి. మన్మథకుమార్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె. రాంబాబు, ఏఆర్‌పీసీ సిబ్బంది శుక్రవారం సాయంత్రం విధులు నిర్వహిస్తుండగా, అక్రమంగా పశువుల రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో చౌటుప్పల్‌లోని తంగడపల్లి క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్ 29టీ 0342 నంబర్ గల మహీంద్రా బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నాలుగు ఆవులు, ఏడు ఎద్దులు కలిపి మొత్తం 11 పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని నడుపుతున్న కోదాడ పట్టణంలోని మాతానగర్‌కు చెందిన ఎస్‌కె. అమీర్ (24)ను విచారించగా, వాహన యజమాని ఎస్‌కె. అక్రం సూచనల మేరకు కోదాడ పశువుల సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని బహదూర్‌పుర ప్రాంతానికి తరలిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు పశువులతో పాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story