చిలుకూరి బాలాజీపై నోరు జారిన అమెరికా సెనెటర్

by Muthe.Rajitha |

అమెరికాలోని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిత్ హైదరాబాదీలను లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

చిలుకూరి బాలాజీపై నోరు జారిన అమెరికా సెనెటర్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలోని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ ష్మిత్ భారతీయులను, ముఖ్యంగా హైదరాబాదీలను లక్ష్యంగా చేసుకుని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. హెచ్-1బి (H-1B) వీసాల ముసుగులో భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా ఒక 'వీసా కార్టెల్' నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని వీసాల మాఫియాకు అడ్డాగా వక్రీకరిస్తూ ఆయన ట్వీట్లు చేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ఫోటోను షేర్ చేస్తూ.. దీనిని 'వీసాల దేవాలయం' అని ఆయన సంబోధించారు. వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులకు ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ ఆలయం చుట్టూ తిరుగుతారని, అమెరికా వర్క్ వీసాలు పొందడమే వీరి లక్ష్యమని ఎద్దేవా చేశారు.

ఈ 'వీసా కార్టెల్'కు ఇది ప్రధాన కేంద్రమని ఆయన ఆరోపించారు. హెచ్-1బి, ఎల్-1, ఎఫ్-1 వంటి వీసా వ్యవస్థలు అమెరికా స్థానిక వేతన వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని ష్మిత్ పేర్కొన్నారు. తక్కువ వేతనాలకే భారతీయులు అందుబాటులో ఉండటంతో, భారీ టెక్ కంపెనీలు అమెరికన్ గ్రాడ్యుయేట్లను పక్కనపెట్టి భారతీయులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని, దీనివల్ల ప్రతిభ కంటే 'జాతి పక్షపాతం' పెరిగిపోతోందని విమర్శించారు.

Next Story