మహిళను కిరాతకంగా చంపి.. ఆపై అమానుషంగా ప్రవర్తించిన నిందితులు

by Disha Web Desk 2 |
మహిళను కిరాతకంగా చంపి.. ఆపై అమానుషంగా ప్రవర్తించిన నిందితులు
X

దిశ, కంది: ఓ మహిళను అతి దారుణంగా చంపి ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో తీసుకొచ్చి ఎవరికీ అనుమానం రాకుండా గ్రామ శివారులో కొందరు దుండగులు పారేసి వెళ్లారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రం పసల్‌వాది గ్రామ శివారులో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సామ శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం.. ఓ గుర్తు తెలియని మహిళను కొందరు వ్యక్తులు చంపి ఆమె మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో తీసుకొచ్చి సంగారెడ్డి మండలం పసల్‌వాది గ్రామ శివారులో పడేసి వెళ్లారు. గ్రామ శివారు పాత బ్రిడ్జ్ సమీపంలోని సర్వే నం.64లో సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, హత్యకు గురైన మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఎక్కడో చంపి నల్లని ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కి ఇక్కడ వదిలి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతిచెందిన మహిళ కాలి వేళ్లకు మెట్టెలు, ఒంటిపై నలుపు రంగు పైజామా, నలుపు రంగు టాప్, నల్లని భురఖా ఒంటిపై ఉన్నట్లు ఎస్ఐ వివరించారు. అలాగే ఆమె రెండు కాళ్ళను చున్నితో కట్టినట్లు గుర్తించారు.

నిందితులను గుర్తించే పనిలో పోలీసులు

మృతి చెందిన మహిళను ఎవరు చంపారనే కోణంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ సిబ్బంది తమ చర్యలు మొదలు పెట్టింది. గురువారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. అలాగే సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం ఓ బృందం ఇప్పటికే ప్రత్యేకంగా పనిచేస్తుంది. మృతిచెందిన మహిళను ఎవరో వారం రోజుల కిందట హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పసల్ వాది వీఆర్వో పెంటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళను ఎవరైనా గుర్తిస్తే వెంటనే 9490617033, 9490617032కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు.

Next Story