హనుమకొండకు రెండు కొత్త బస్సు సర్వీసులు

by Ratna Kumari |

హనుమకొండకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని గత కొంతకాలంగా తుంగతుర్తి ప్రాంత ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులకు సూర్యాపేట ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

హనుమకొండకు రెండు కొత్త బస్సు సర్వీసులు
X

దిశ, తుంగతుర్తి : హనుమకొండకు నేరుగా బస్సు సౌకర్యం కల్పించాలని గత కొంతకాలంగా తుంగతుర్తి ప్రాంత ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులకు సూర్యాపేట ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మరో రెండు, మూడు రోజుల్లో హనుమకొండకు రెండు బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు సూర్యాపేట డిపో మేనేజర్ సునీత తెలిపారు. ఈ మేరకు తుంగతుర్తి మీదుగా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో హనుమకొండకు బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆమె వెల్లడించారు.

తుంగతుర్తి–హైదరాబాద్ సర్వీసులో మార్పు..

తుంగతుర్తి–అర్వపల్లి–నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు కొత్త బస్సు సర్వీసును శనివారం నుంచి ప్రారంభించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ బస్సు ప్రతిరోజూ సూర్యాపేట నుంచి బయలుదేరి ఉదయం 7:40 గంటలకు తుంగతుర్తికి చేరుకుని, అక్కడి నుంచి అర్వపల్లి మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 1:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు ఇదే మార్గంలో ప్రయాణించి సాయంత్రం 5 గంటలకు తుంగతుర్తికి చేరుకుంటుందని వివరించారు. ఈ కొత్త సర్వీసుతో తుంగతుర్తి, అర్వపల్లి ప్రాంతాల ప్రజలకు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో గతంలో ఉదయం 8:45 గంటలకు తుంగతుర్తి–అర్వపల్లి మీదుగా దిల్‌సుఖ్‌నగర్ వరకు నడిచే బస్సు సర్వీసును పూర్తిగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు.

Next Story