ఒమన్‌లో డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి

by Muthe.Rajitha |

ఒమన్‌లోని సోహర్ నగరంపై జరిగిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మృతి చెందినట్టు సమాచారం.

ఒమన్‌లో డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఒమన్‌లోని కీలక పారిశ్రామిక నగరమైన సోహార్‌పై శుక్రవారం డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మొత్తం 11 మంది గాయపడగా, వారిలో 10 మంది భారతీయులే ఉన్నట్లు సోహార్ అధికారులు వెల్లడించారు. బాధితులంతా అక్కడ వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులుగా గుర్తించారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా యుద్ధాలకు దూరంగా ఉండే ఒమన్‌ భూభాగంపై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కావడంతో అక్కడి భారతీయులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ దాడి వెనుక ఉన్న శక్తుల గురించి ఒమన్ రక్షణ శాఖ విచారణ చేపట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనపై ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) వెంటనే స్పందించింది. బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, మృతదేహాలను త్వరలోనే భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాయబార కార్యాలయం ప్రకటించింది. అలాగే, అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Next Story