12 గంటల్లో చోరీ కేసు ఛేదించిన తూప్రాన్ పోలీసులు

by Ratna Kumari |

తూప్రాన్ మండలంలో ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసును పోలీసులు కేవలం 12 గంటల్లో ఛేదించారు.

12 గంటల్లో చోరీ కేసు ఛేదించిన తూప్రాన్ పోలీసులు
X

దిశ, తూప్రాన్ : తూప్రాన్ మండలంలో ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలు చోరీ చేసిన కేసును పోలీసులు కేవలం 12 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. డీఎస్పీ వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంజి పాండురంగం తన కుమార్తె వివాహం కోసం రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలను ఇంట్లోని బీరువాలో భద్రపరిచారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిద్దిపేట జిల్లా అంబర్‌పేటకు చెందిన పల్లపు రాజు ఇంటి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. అనంతరం బీరువాలో ఉన్న రూ.7 లక్షల నగదు, వెండి ఆభరణాలను అపహరించి పరారయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు సామాను చెల్లాచెదురుగా ఉండటం, బీరువాలో నగదు, ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని 12 గంటల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన నగదు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ చెప్పారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఇన్‌చార్జి సీఐ సైదా, ఎస్‌ఐలు గంగరాజు, చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Next Story