తుమ్మల సంచలన వ్యాఖ్యలు.. వారిని అసలే నమ్మొద్దంటూ..

by Disha Web Desk 19 |
తుమ్మల సంచలన వ్యాఖ్యలు.. వారిని అసలే నమ్మొద్దంటూ..
X

దిశ, నేలకొండపల్లి: రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు గాని రాజకీయ ద్రోహులను మాత్రం నమ్మొద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శత్రువులు వాళ్ళ పార్టీకి ఓటు వేసుకుంటారు. కానీ రాజకీయద్రోహులు మాత్రం ఉన్న పార్టీనే ఓడించే పెద్దలుంటారన్నారు. ద్రోహులను కనిపెట్టే బాధ్యత మీదేనని నేను తప్పకుండా మీముందుకు వస్తానన్నారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో బుధవారం ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన వస్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ కాన్వాయ్ నడుమ ర్యాలీ నిర్వహించారు. గువ్వలగూడెం వద్ద తుమ్మలకు గ్రామస్తులు, అభిమానులు పూలవర్షంతో స్వాగతం పలికారు. చెర్వుమాధారం గ్రామంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచేందుకు అన్ని పథకాలను అమలుచేసి అగ్రగామిగా నిలిపానన్నారు. సీఎం కేసీఆర్ ఉదార స్వభావంతో పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం జిల్లాకు ఇచ్చిన అభివృద్ధి పథకాలను పూర్తిచేసే బాధ్యత నాదేనన్నారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులను కూడా సీఎం కేసీఆర్‌తో మాట్లాడి పూర్తి చేయిస్తానన్నారు. ఈ సందర్భంగా మీరు నాకు ఇచ్చిన ఈ అపూర్వ స్వాగతానికి జన్మ జన్మల రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు సాధు రమేశ్ రెడ్డి, బండి జగదీష్, వెన్నపూసల సీతారాములు, తమ్మినేని కృష్ణయ్య, జొన్నలగడ్డరవి, కొండా మహిపాల్, విష్ణు, వేణు, పత్తి శ్రీనివాస్, రాధాకృష్ణ, కడియాల నరేష్, నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed