ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆదివాసీ యువకుడు ఎంపిక

by Batti.Sumithra |

ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి భారతదేశం నుంచి కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం లభించింది.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆదివాసీ యువకుడు ఎంపిక
X

దిశ, ఇచ్చోడ : ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి భారతదేశం నుంచి కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం లభించింది. వారిలో ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, డూపర్‌పేట్ గూడెంకు చెందిన ఆదివాసీ యువకుడు కత్లే ఆనంద్ ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా డూపర్‌పేట్ గ్రామంలోని ఆదివాసీలు సంబరాలు జరుపుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం దిశతో మాట్లాడిన ఆనంద్ కుటుంబ సభ్యులు, ఈ ఎంపిక తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని తెలిపారు.

నేపాల్‌లో జూలై 27 నుంచి ఆగస్టు 20 వరకు నిర్వహించనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కార్యక్రమానికి ఆనంద్ ఎంపిక కావడంతో నిరుపేద ఆదివాసీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే నేపాల్ వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత తమకు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణ ఖర్చులు సుమారు రూ.50,000కు పైగా అవుతాయని, అంత మొత్తాన్ని భరించే పరిస్థితి తమ కుటుంబానికి లేదని ఆనంద్ తెలిపారు. దాతలు, ప్రజాప్రతినిధులు లేదా అధికారులు ఆర్థిక సహాయం అందించి తనకు అండగా నిలిస్తే, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొని జిల్లా పేరును నిలబెడతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story