- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంబార్లో బల్లి.. హోటల్ సీజ్..!
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ టిఫిన్ హోటల్లో సాంబార్లో బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, ఇచ్చోడ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ పట్టణంలోని ఓ టిఫిన్ హోటల్లో సాంబార్లో బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం పట్టణానికి చెందిన రాజేశ్వర్ టిఫిన్ చేసేందుకు మహేశ్వరి థియేటర్ సమీపంలోని బాదం జ్యూస్ బార్ టిఫిన్ సెంటర్కు వెళ్లాడు. దోసా తింటున్న సమయంలో సాంబార్లో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే హోటల్ సిబ్బందికి విషయం తెలియజేసి నిర్వాహకులను నిలదీశాడు. దీనిపై నిర్వాహకులు "తప్పు జరిగిపోయింది" అని సమాధానం చెప్పినట్లు బాధితుడు తెలిపారు. బల్లి పడిన సాంబార్ తిని ఎవరైనా అస్వస్థతకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఘటన పై బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ సిబ్బందితో కలిసి హోటల్ను తనిఖీ చేసి వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు గుర్తించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హోటల్ను సీజ్ చేశారు. హోటల్ యజమాని రవిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలే పట్టణంలో ఆహార భద్రతపై ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, పక్షం రోజులు కూడా గడవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రత విషయంలో రాజీ పడకుండా అన్ని హోటళ్లలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.






