ఆధ్యాత్మిక పేరుతో చిన్న జీయర్ స్వామి అక్రమ వ్యాపారం .. గిరిజన నేత సంచలన వ్యాఖ్యలు

by Dishafeatures2 |
ఆధ్యాత్మిక పేరుతో చిన్న జీయర్ స్వామి అక్రమ వ్యాపారం .. గిరిజన నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, అచ్చంపేట : తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారక్కపై చిన్న జీయర్ స్వామి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి, గిరిజన నేత పి.రఘు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అడవి దేవతలైన సమ్మక్క సారక్కను ఉద్దేశపూర్వకంగా అవమానించిన చిన్న జీయర్ స్వామి కళ్ళు నెత్తికెక్కాయని విమర్శించారు.

ఆధ్యాత్మికత పేరిట వ్యాపారం..

ఆశ్రమాలు, ఆధ్యాత్మికత పేరిట వ్యాపారం చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను గుప్పిట్లో పెట్టుకుని చిన్న జీయర్ స్వామి రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తన సమతా మూర్తి పర్యాటక కేంద్రాన్ని ఎవరు పట్టించుకోవడం లేదన్న అక్కసుతోనే సమ్మక్క సారక్కలపై అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. ఆత్మగౌరవ పోరాటానికి సూచిక లైన వన దేవతలు సమ్మక్క సారక్కను విమర్శిస్తే గిరిజన సమాజం ఊరుకోదని హెచ్చరించారు. సమతా మూర్తి పేరుతో 120 కిలోల బంగారు విగ్రహం పెట్టి.. అది చూడటానికి వచ్చిన వారి నుండి రూ.150 టికెట్ పెట్టి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.

సమతా మూర్తి పేరుతో ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని అన్నారు. మా తల్లుల దగ్గర ఎటువంటి టికెట్ లేదని, సమ్మక్క సారక్క దగ్గర ఎలాంటి వ్యాపారం జరగదని నొక్కివక్కానించారు. లక్ష రూపాయలు తీసుకోకుండా మీరెప్పుడైనా పేద వారి ఇంటికి వెళ్ళారా అని ప్రశ్నించారు ? చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలపై వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు.

ముచ్చింతల ఆశ్రమాన్ని ముట్టడిస్తాం..

విమర్శలు మానుకోకపోతే ముచ్చింతల ఆశ్రమాన్ని ముట్టడిస్తామని, చిన్న జీయర్ స్వామిని బయట అడుగు పెట్టనీయబోమని హెచ్చరించారు. బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఆశ్రమాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

Next Story

Most Viewed