- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్నవరం మండలంలో విషాదం.. చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి!
గన్నవరం మండలం కండ్రికలో విషాదం. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి. మృతులు నవీన్ కుమార్, గొల్ల సాయి, వెంకట జోసెఫ్ గా గుర్తింపు. శోకసంద్రంలో గ్రామం.

దిశ, వెబ్ డెస్క్: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం పంచాయతీ పరిధిలోని కండ్రిక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొప్పల నవీన్ కుమార్ (12), గొల్ల సాయి (15), ముచ్చు వెంకట జోసెఫ్ (15) అనే ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు స్థానిక చెరువులోకి దిగారు. అయితే, చెరువు లోతును అంచనా వేయలేకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
స్థానికుల సహాయంతో పోలీసులు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. చేతికి అందిన కొడుకులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో కండ్రిక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెలవు రోజుల్లో పిల్లలు నీటి వనరుల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.






