నేడు గాంధీభవన్ లో టీపీసీసీ పీఏసీ, అడ్వయిజరీ కమిటీల భేటీ

by Muthe.Rajitha |

తెలంగాణలో ప్రారంభం కాబోతున్న SIR ప్రక్రియపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కీలక అంశాలను చర్చించేందుకు నేడు టీపీసీసీ కీలక సమావేశాలను ఏర్పాటు చేసింది.

నేడు గాంధీభవన్ లో టీపీసీసీ పీఏసీ, అడ్వయిజరీ కమిటీల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రారంభం కాబోతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపైన పార్టీ శ్రేణులకు, ప్రధానంగా ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ)కు అవగాహాన కల్పించేందుకు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కీలక అంశాలను చర్చించేందుకు నేడు టీపీసీసీ కీలక సమావేశాలను ఏర్పాటు చేసింది. గాంధీభవన్ లో ఉదయం 10.30 గం.ల నుంచి సాయంత్రం వరకూ ఎస్ఐఆర్, బీఎల్ఏలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ పైన తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఇటీవలనే టీపీసీసీ ఈసీ కమిటీ ఆధ్వర్యంలో సీఈసీకి వినతిపత్రం ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐఆర్ అంశంలో బీఎల్ఏల పాత్రను గురించి వారికి పూర్తి అవగాహాన కార్యక్రమాలను చేపట్టనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం కీలకమైన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, అడ్వయిజరీ కమిటీల సమావేశాన్ని నిర్వహించున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జి కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్​మహేష్​కుమార్ గౌడ్, పీఏసీ, అడ్వయిజరీ కమిటీల సభ్యులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. కాగా పీఏసీ, అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో ప్రధానంగా పార్టీ పరంగా చేపట్టవల్సిన కార్యక్రమాలు, ఎస్ఐఆర్ పైన చర్చ, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన ఈ సమావేశాల్లో చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Next Story