తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం

by Malleboina Mahesh |

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిసరాల్లో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ పెద్దపులి కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం (Tiger roaming) మళ్లీ తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అటవీ అధికారులకు, గిరిజన గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పులి, మళ్లీ జిల్లా పరిసరాల్లోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. తాజాగా మన్యంలోని అటవీ ప్రాంతంలో ఓ అడవి పంది పిల్లతో పులి కలిసి ఉన్న విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌గా మారాయి. దేవీపట్నం మండలం సరిహద్దు ప్రాంతాలతో పాటు సీతానగరం మండలంలోని రాయదుర్గం కొండ, పురుషోత్తపట్నం, నెలకోట ఆవ పరిసర ప్రాంతాలలో పెద్దపులి సంచరించినట్లు అధికారులు స్పష్టమైన ఆధారాలను గుర్తించారు.

పులి కదలికలు నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో అటవీశాఖ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా పులి సంచార ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మన్యం కొండలు, మైదాన ప్రాంతాల వైపు పులి తన కదలికలను మార్చుకుంటూ తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు పర్యవేక్షణను ముమ్మరం చేశారు.

Next Story