సర్ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకం : మంత్రి సీతక్క

by Batti.Sumithra |

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు.

సర్ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకం : మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ SIR ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బూత్ స్థాయి ఏజెంట్లు ఎన్నికల వ్యవస్థకు వెన్నెముకలాంటివారని, ప్రతి అర్హుడైన ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిజమైన ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పార్టీ శ్రేణులు వారికి అండగా నిలవాలని కోరారు. అలాగే, బీఎల్‌ఏలు హ్యాండ్‌బుక్‌లోని మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కళ్యాణి, పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story