వారు క్లాస్ ద్రోహులు.. పార్టీని వీడిన నేతలపై కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు!

by Malleboina Mahesh |

పార్టీని వీడి స్వతంత్రంగా పోటీ చేస్తున్న మాజీ నేతలపై కేరళ సీఎం పినరయి విజయన్ నిప్పులు చెరిగి.. వారిని "క్లాస్ ద్రోహులు"గా అభివర్ణించారు.

వారు క్లాస్ ద్రోహులు.. పార్టీని వీడిన నేతలపై కేరళ సీఎం పినరయి విజయన్ ఘాటు వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్ డెస్క్: కేరళం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీ మరోసారి విజయం కోసం కష్టపడుతుండగా. కాంగ్రెస్, ఎన్డీయే కూటమి కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రచారంలో వేగం పెంచాయి. ముఖ్యంగా బీజేపీ అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఇతర పార్టీలోని కీలక నేతలను పార్టీలో చేర్పించుకొని టికెట్లు ఇస్తుంది. అలాగే మరికొంత మంది అధికార పార్టీ టికెట్ దక్కక పోవడంతో రాజీనామా చేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ పరిణామాలపై సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సిపిఐ(ఎం) పార్టీలో టికెట్లు దక్కలేదన్న అసంతృప్తితో పార్టీని వీడి, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలపై పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆశయాల కోసం పార్టీకి వ్యతిరేకంగా తిరగబడటం సిపిఐ(ఎం) చరిత్రలో మునుపెన్నడూ లేని పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. అంబలపుజలో జి. సుధాకరన్, ఒట్టపాలంలో పి.కె. శశి, తాలిపరంబలో టి.కె. గోవిందన్, పయ్యన్నూర్‌లో కుంజికృష్ణన్ వంటి మాజీ నేతలు అభ్యర్థులుగా నిలబడటం దురదృష్టకరమని, దీనిని పార్టీ అత్యంత సీరియస్‌గా పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

పార్టీని వీడిన ఈ నేతలందరూ ఇప్పుడు శత్రువుల చేతుల్లో పావులుగా మారారని పినరయి విజయన్ విమర్శించారు. వారిని పార్టీ "క్లాస్ ద్రోహులు" (Class Traitors) గా పరిగణిస్తోందని, సిపిఐ(ఎం) కార్యకర్తలు ఎవరూ వారితో సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినంత మాత్రాన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) విజయావకాశాలపై ఎటువంటి ప్రభావం పడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎల్‌డిఎఫ్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, పార్టీలో ఏర్పడిన ఈ చిన్నపాటి చీలిక వల్ల ఎల్‌డిఎఫ్ గెలుపు గుర్రానికి ఎటువంటి అడ్డంకులు ఉండబోవని ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story