ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపులు..?

by Disha Web Desk 12 |
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇంకెన్నాళ్లు ఈ ఎదురుచూపులు..?
X

దిశ, మెదక్ : జాతీయ ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌లకు ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురు ఇంకా అందలేదు.. రాష్ట్ర సర్కార్ జీవో కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని మంత్రులు ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన వారికి గత నెలలో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ సీఎం ప్రకటన ఇంకా అమల్లోకి రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పించేందుకు పథకం ప్రారంభంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఓ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1034 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా.. మెదక్ జిల్లాలో మాత్రం 265 మంది విధులు నిర్వహించారు.

ఆ తర్వాత పథకంలో పలు మార్పులు తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఫీల్డ్ అసిస్టెంట్‌ల ఉనికికే ప్రమాదకరంగా ఉండే 4779 జీవోను ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ నూతన జీవో ప్రకారం కూలీలకు పని కల్పించిన దాన్నిబట్టి వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని వ్యతిరేకించిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. ఆందోళన బాట పట్టారు. ఇందుకు ఆగ్రహించిన ప్రభుత్వం 19 మార్చి 2020న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ లను పూర్తిగా రద్దు చేసి, ఆ బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులను అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన సర్కారు, వారి గోడును పట్టించుకోలేదు. అందులో కరోనా వైరస్ వ్యాప్తితో వారి ఆందోళన క్రమంగా చల్లబడింది. గ్రామాల వారీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యేలు మంత్రులకు విజ్ఞప్తులు చేశారు.

హుజరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో మూకుమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ గత నెల 17న అసెంబ్లీలో ఫీల్డర్లను మళ్లీ వీధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సాక్షాత్తు సీఎం ప్రకటన చేయడంతో జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎంకు రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ దాదాపు నెల గడుపుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి జీవో రాలేదు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి సీఎం ఈ ప్రకటనతో సంతోషం వెల్లివిరిసిన.. ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూపులు అన్న నిరుత్సాహం వారిలో వ్యక్తమవుతోంది.

ఎదురుచూపులు తప్పవా..

అసెంబ్లీలో సీఎం ప్రకటించిన తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడే వరకు విధుల్లోకి తీసుకుని అవకాశం ఉండదు. ఓవైపు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. గతంలో మాదిరిగానే పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ లకు సంబంధించిన ఉత్తర్వులు వస్తుందని ఎదురు చూసిన ఇప్పటివరకు రాలేదు. దీంతో మరి కొన్నాళ్ళ పాటు వేచి చూడడం తప్ప ఫీల్డ్ అసిస్టెంట్లు ఏమి చేసే పని లేదు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం ప్రతినిధులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఉత్తర్వులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్ల నిరీక్షణ తీరేనా మరి కొన్నాళ్ళు ఎదురుచూపులు తప్పవు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story