ప్రపంచమే మన మార్కెట్: నాణ్యతలో రాజీ పడొద్దు - పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు!

by Malleboina Mahesh |

గ్లోబల్ స్టాండర్డ్స్‌ను మించిన నాణ్యతే లక్ష్యం కావాలని ప్రధాని మోదీ పిలుపు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లతో భారత్‌కు అపార అవకాశాలు; రీసెర్చ్‌పై పెట్టుబడి పెంచాలని సూచన.

ప్రపంచమే మన మార్కెట్: నాణ్యతలో రాజీ పడొద్దు - పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ అంతర్జాతీయ వాణిజ్యం లో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని, పరిశోధన, అభివృద్ధి (R&D)పై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) మన పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే మనం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా, వాటిని మించిన నాణ్యతను సాధించాలని పిలుపునిచ్చారు.

అలాగే మన శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను కేవలం ఒక్క అంశంపైనే కేంద్రీకరించాల్సి వస్తే, అది కచ్చితంగా 'నాణ్యత' (Quality) మాత్రమే కావాలని ప్రధాని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ముద్ర వేయాలంటే నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని హెచ్చరించారు. మన వస్తువులు కేవలం మేలైనవిగా ఉండటమే కాకుండా, ఇతర దేశాల ప్రజల అవసరాలను, వారి అంచనాలను మించి ఉండాలని సూచించారు. ఇందుకోసం నిరంతరం అధ్యయనం చేస్తూ, ప్రపంచ మార్కెట్ ధోరణులను అర్థం చేసుకోవడం అత్యవసరమని ఈ సందర్భంగా ఆమర వివరించారు.

విదేశీ వినియోగదారులకు అనువైన (User-friendly) ఉత్పత్తులను సృష్టించినప్పుడే మనం ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుకోగలమని మోదీ పేర్కొన్నారు. "అభివృద్ధి అనే రహదారి (Highway of Development) మీ కోసం సిద్ధంగా ఉంది, దానిని ఉపయోగించుకోవాల్సింది మీరే" అంటూ పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేశారు. పరిశోధనలపై దృష్టి సారించి, అంతర్జాతీయ అంచనాలకు తగ్గట్టుగా నవకల్పనలు (Innovations) చేసినప్పుడే 'మేక్ ఇన్ ఇండియా' ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌గా మారుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story