మొరం మాఫియా కక్కుర్తికి నిండు ప్రాణం బలి..

by Disha Web Desk 19 |
మొరం మాఫియా కక్కుర్తికి నిండు ప్రాణం బలి..
X

దిశ, బాల్కొండ: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి, మొరం మాఫియా కక్కుర్తికి ఓ నిండు ప్రాణం బలైంది.మొరం తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ ఉదయం చనిపోయిన గంటలు గడిచిన గానీ, కనీసం సంబంధిత మొరం మాఫియా కన్నెత్తి చూడలేదు. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలలోకి వెళితే.. ముప్కాల్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళలో ఎస్సారెస్పీ జీరో పాయింట్, వరద కాలువ సమీపం నుండి అక్రమంగా మొరం తరలిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి వేళలో అక్రమంగా మొరం తరలిస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ముప్కాల్‌కు చెందిన బోదాసు గంగాధర్ అనే (20 ) యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యాయం చేసే వరకు ఘటన స్థలం నుండి మృతదేహాన్ని తీయమని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దీనితో ట్రాక్టర్ యజమాని మృతుని కుటుంబానికి 8లక్షల నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముప్కాల్ ఎస్సై గోపీ తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అక్రమ రవాణా అరికట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Next Story