నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే.. ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా త్వరలో జరగబోయే జనగణన (Census) ప్రక్రియపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గాల పునర్విభజన అప్పుడే.. ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా త్వరలో జరగబోయే జనగణన (Census) ప్రక్రియపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడిమాతో మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టదని, కేవలం 6 నెలల కాలంలోనే దీన్ని పూర్తి చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. జనగణన ముగిసిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపడతామని, ఈ మొత్తం ప్రక్రియ వచ్చే ఎన్నికల లోపే పూర్తవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జనగణన అనేది కేవలం జనాభా లెక్కలకే పరిమితం కాకుండా, శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల అమలుకు జనగణన, పునర్విభజన అనేవి కీలకమైన అడుగులని లక్ష్మణ్ వివరించారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాక, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ (One Nation - One Election) దిశగా అడుగులు పడుతున్న తరుణంలో, తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వచ్చే అవకాశం ఉందని లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story