భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

by Ratna Kumari |

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
X

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి : భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి హెచ్చరించారు. 'కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సాధారణ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షల బీమా సాయం అందించాలని, ప్రసవం, పెళ్లి కానుకలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రెండింతలు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజులలోపు కార్డులు జారీ చేయాలని, గత ప్రభుత్వం హామీ ఇచ్చిన లక్ష బైకులను తక్షణమే పంపిణీ చేయాలని కోరారు. అలాగే 55 సంవత్సరాలు దాటిన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే కలెక్టరేట్లు, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గోనెల రాములు, జిల్లా కార్యదర్శి వరద గాలన్న, రాజు, వెంకట్రాములు, యాదయ్య, చెన్నయ్య, ఎర్ర వెంకటయ్య, గోద రాములు, పడాల వెంకటయ్య, రాములు, బుచ్చిబాబు, జుర్రు సత్యం, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప తహసీల్దార్ దేవేందర్, ఆర్డీవో కార్యాలయ ఏఓకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

Next Story