మోడీ నాలాగే మేల్కొనే ఉంటారు.. తక్కువ నిద్రపోతారు: ట్రంప్

by I. Sairam |

మోడీ కూడా తనలాగే తక్కువగా నిద్రపోతారని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్నరి భారత్ లోని అమెరికా రాయబారి తాజాగా ఓ సమావేశంలో షేర్ చేసుకున్నారు.

మోడీ నాలాగే మేల్కొనే ఉంటారు.. తక్కువ నిద్రపోతారు: ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదయం 6 గంటలకే ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేయాలని అనుకున్న ఒక ఆసక్తికరమైన ఘటనను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ షేర్ చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. ట్రంప్ ప్రధాని మోడీని ఒక స్నేహితుడుగా భావిస్తారని తెలిపారు. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేయడానికి ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉంటారని చెప్పారు. కొన్ని నెలల క్రితం మయామిలో జరిగిన ఒక యూఎఫ్‌సీ ఈవెంట్ నాటి సంఘటనను గోర్ గుర్తుచేసుకుంటూ.. ట్రంప్ అకస్మాత్తుగా ప్రధాని మోడీకి ఫోన్ చేయాలని తనతో అన్నారని అన్నారు. అప్పుడు భారత్‌లో ఉదయం 6 గంటలు అవుతుందని తాను ట్రంప్‌కు గుర్తుచేశానని తెలిపారు. అయితే దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ‘ఆయన మేల్కొనే ఉంటారు. ఆయన నా లాంటివారే. చాలా తక్కువ సమయం నిద్రపోతూ ఎప్పుడూ దేశం కోసం శ్రమిస్తుంటారని’ అని సమాధానమిచ్చారని తెలిపారు. ట్రంప్ భారత్ గురించి ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారని, తన గత భారత పర్యటనను తరచూ గుర్తుచేసుకుంటుంటారని గోర్ తెలిపారు.

భారత్ ఓ కష్టతరమైన ప్రాంతంలో ఉంది

భారతదేశం ప్రపంచంలోనే ఒక కష్టతరమైన ప్రాంతంలో ఉందని, అక్కడ కొన్ని కఠినమైన పొరుగు దేశాలు ఉన్నాయని సెర్గియో గోర్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో కొంతమంది ఉదయం బ్యాడ్ మూడ్‌తో నిద్రలేస్తే చాలు, అక్కడ పరిస్థితులు మారిపోతాయని ఆయన అన్నారు. అయితే స్వల్పకాలిక రాజకీయ పరిణామాల వల్ల అమెరికా, భారత్ మధ్య సంబంధాలకు ఎలాంటి ముప్పూ ఉండదని, ఎందుకంటే ఈ బంధం పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉందని తెలిపారు. ఏఐ, టెక్నాలజీ, ఏవియేషన్ వంటి ఏ రంగాన్ని తీసుకున్నా, ఇరు దేశాల మధ్య కలిసి పనిచేసేందుకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా భారతదేశంతో చేతులు కలిపి పనిచేయాలని ఆకాంక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే 2 ఏళ్లు ఈ బంధాన్ని రాబోయే కొన్ని దశాబ్దాల కాలం పాటు ఒక మార్గంలో నడిపిస్తాయని, కాబట్టి దీనిని ఒక దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌గా భావించాలని ఆయన చెప్పారు.

Next Story