హోలీ సంబరాల్లో మందుబాబుల వీరంగం.. కానిస్టేబుల్, ఎస్ఐ‌కి గాయాలు

by Dishanational2 |
హోలీ సంబరాల్లో మందుబాబుల వీరంగం.. కానిస్టేబుల్, ఎస్ఐ‌కి గాయాలు
X

దిశ, కామారెడ్డి రూరల్ : ప్రశాంతంగా జరగాల్సిన హోళీ సంబరాలు మందుబాబుల వీరంగంతో రణరంగంలా మారింది. ఫుల్‌గా మద్యం సేవించి ముగ్గురు యువకులు బీరు బాటిళ్లు పగులగొట్టి హంగామా సృష్టించారు. అడ్డొచ్చిన మహిళ ఫోన్ పగులగొట్టి చెంప చెల్లుమనిపించారు. పోలీసులపై కూడా మద్యం బాటిళ్లు విసిరారు. ఈ ఘటనలో ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో మద్యం మత్తులో మందు బాబులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో బీరు బాటిల్లు, మద్యం బాటిల్లు మహిళపై విసరడంతో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులపై మందు బాబులు మద్యం బాటిళ్లు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు ఎస్ఐకి గాయాలయ్యాయి. అనంతరం స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్.హెచ్.ఓ నరేష్ మాట్లాడుతూ.. అశోక్ నగర్ కాలనీలో పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది మద్యం మత్తులో వీరంగం సృష్టించారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులపై మందు బాబులు బాటిళ్లు రువ్వుతూ వీరంగం సృష్టించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ తెలిపారు.



Next Story