అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

by Disha Web Desk 13 |
అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
X

దిశ, మంచిర్యాల: సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అగ్రి గోల్డ్ కంపెనీ 1995 లో ప్రారంభించబడింది. అగ్రిగోల్డ్ కంపెనీ లో డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయని నమ్మించి డిపాజిటర్ల పేర్లతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 5 వేల కోట్ల రూపాయల వరకు వసూలు.. చేసి కంపెనీలను ప్రారంభించారు.

ఆ డబ్బులతో స్థలాలు రిసార్ట్ నిర్మించారు. డిపాజిట్ చేసిన డబ్బులు కస్టమర్లకు తిరిగి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 2015 సంవత్సరంలో అగ్రిగోల్డ్ కంపెనీ మేనేజ్మెంట్ చేతులెత్తేసింది. మేనేజ్మెంట్‌ను అరెస్టు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నారు. తమ కష్టార్జితాన్ని నష్టపోయామని మోసపోయే అనుకున్న కొంతమంది డిపాజిట్ దారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏజెంట్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏజెంట్లు బాధితులు ధర్నాలు రాస్తారోకోలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి అక్కడున్న కస్టమర్లకు రెండు దఫాలుగా డబ్బులు చెల్లించడం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అగ్రి గోల్డ్ కంపెనీలో డిపాజిట్ చేసిన వారు, చేయించిన ఏజెంట్లు మొత్తం దాదాపు 5 లక్షల మంది ఉంటారు, వారి మొత్తం డిపాజిట్లు 500 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు సైతం 1000 కోట్ల పైనే ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో అగ్రి గోల్డ్ కంపెనీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిపాజిట్ దారులకు తక్షణమే తెలంగాణ ప్రభుత్వం డబ్బులు చెల్లించి బాధితులను ఆదుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కంపెనీ ఫౌండర్ డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యులు వారి బినామీ పేర్ల మీద ఉన్న సకల ఆస్తులను తక్షణమే అటాచ్మెంట్ చేయాలి. అగ్రిగోల్డ్ యజమాన్యం రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి వారందరికీ స్వాధీనం చేయాలి. అగ్రిగోల్డ్ సమస్య వల్ల చనిపోయిన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. అగ్రిగోల్డ్ ఆస్తులన్ని బాధితులకు చేరడానికి సమయం పడుతుంది.. కావున అనేక ఇబ్బందులు పడుతున్న అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో తక్షణమే ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి.. ఏవో సురేష్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకల దాస్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, మిట్టపల్లి పౌలు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు లింగం రవి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జీవన్ దేవరాజ్, సుధాకర్, రవి, కమల సతీష్, రామారావు, అరవింద్, మోహన్, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed