అదృశ్యమైన నలుగురు విద్యార్థినులు క్షేమం !

by Batti.Sumithra |

పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఒకేసారి అదృశ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అదృశ్యమైన నలుగురు విద్యార్థినులు క్షేమం !
X

దిశ, పటాన్‌చెరు టౌన్ : పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు ఒకేసారి అదృశ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూలై 23న పాఠశాలకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఈ బాలికలు తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అదృశ్యమైన బాలికలంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల కుమార్తెలు కాగా, వారి తల్లిదండ్రులు పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అదృశ్యమైన విద్యార్థినులను కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియా కుమారి (12)గా గుర్తించారు. ప్రతిరోజులాగే స్కూల్ బ్యాగులతో పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇళ్ల నుంచి బయలుదేరిన వీరు సాయంత్రం వరకు ఇంటికి చేరుకోలేదు.

దీంతో తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులను సంప్రదించగా, ఆ రోజు బాలికలు అసలు పాఠశాలకు హాజరు కాలేదని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తుల వద్ద విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో జూలై 25న బాధితుల తల్లిదండ్రులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా తప్పిపోయిన నలుగురు మైనర్ విద్యార్థినుల ఆచూకీ సికింద్రాబాద్ లో గుర్తించినట్టు, వారిని క్షేమంగా తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పటాన్‌చెరు సీఐ యం. రవిందర్ మాట్లాడుతూ విద్యార్థినులు క్షేమంగా దొరికినందున వారు అదృశ్యమైనట్లు వార్తలను సోషల్ మీడియాలో లేదా ఇతర మాధ్యమాల్లో ఇక పై వైరల్ చేయవద్దని ప్రజలను, మీడియా ప్రతినిధులను కోరారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు చేరవేసి, ఎలాంటి అపోహలు లేదా దుష్ప్రచారం చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story