ఎన్నికల సంఘం సీరియస్.. 11 వేల పోస్ట్‌ల తొలగింపు.. AI కంటెంట్‌పై ఉక్కుపాదం

by Malleboina Mahesh |

ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో 11 వేల అభ్యంతరకర పోస్టులపై చర్యలు తీసుకుంది. డీప్‌ఫేక్ కంటెంట్‌ను 3 గంటల్లోపు తొలగించాలని ఆదేశిస్తూ నిబంధనలు కఠినం చేసింది.

ఎన్నికల సంఘం సీరియస్.. 11 వేల పోస్ట్‌ల తొలగింపు.. AI కంటెంట్‌పై ఉక్కుపాదం
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) యాక్టీవ్ గా ఉంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకరమైన పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ సీరియస్ అయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మార్చి 15 నుంచి ఇప్పటివరకు ఎన్నికల సంఘం సుమారు 11,000 కంటే ఎక్కువ అభ్యంతరకర పోస్ట్‌లు, URLలపై కఠిన చర్యలు తీసుకుంది. వీటిని తొలగించడంతో పాటు బాధ్యులపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినట్లు ఈసీ ఈ రోజు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించే డీప్‌ఫేక్స్ లేదా తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను గుర్తించిన మూడు గంటల్లోపు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాలని ఈసీ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారం, ఈవీఎంలపై దుష్ప్రచారం చేసే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతోంది.

ప్రస్తుత ఎన్నికల స్థితిగతుల విషయానికొస్తే, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఇప్పటికే ముగియగా, ఈ నెల 23, 29 తేదీల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన 'సి-విజిల్' (cVIGIL) యాప్ ద్వారా ఇప్పటివరకు 3.23 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో 96 శాతం ఫిర్యాదులను ఎన్నికల యంత్రాంగం కేవలం 100 నిమిషాల్లోపు పరిష్కరించి రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఓటర్లను ప్రభావితం చేసే ఏవైనా కృత్రిమ మేధ (AI) కంటెంట్‌ను తప్పనిసరిగా 'సింథటిక్ కంటెంట్' అని లేబుల్ చేయాలని ఈసీ స్పష్టం చేసింది.

Next Story