ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాలి..

by Disha Web Desk 13 |
ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను విధుల్లోకి తీసుకోవాలి..
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల‌ను వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యద‌ర్శి కాడిగ‌ళ్ల భాస్కర్‌, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంది జంగ‌య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుర్కయంజాల్‌లోని ఇబ్రహీంప‌ట్నం ఆర్డీవో ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధ‌ర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో నెంబ‌ర్ 4779 ను ర‌ద్దు చేసి, క‌నీస వేత‌న చ‌ట్టాన్ని అమ‌లు చేయాల‌ని కోరుతూ.. స‌మ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం రాత్రికి రాత్రే తీసేసింద‌ని ఆరోపించారు.


తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో 7,651మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున ప‌డ్డార‌ని, వారి కుటుంబాలు ఆగ‌మైపోయాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, పంచాయతీరాజ్ కమిషనర్ లకు, కలెక్టర్లకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామ‌ని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటన చేయాలని, లేదంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జగన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ చంద్రయ్య, యాచారం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షుడు కలకొండ జంగయ్య, బాల‌రాజు, కుమార్, ప్రేమలత, యాదగిరి, దానయ్య, రామలింగం, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి. జగదీశ్, పెండ్యాల బ్రహ్మయ్య, డి. కిషన్ ఈ. నరసింహ, జె. ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed