- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లెల్లో మృగశిర కార్తె సందడి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో సోమవారం మృగశిర కార్తె సందడి నెలకొంది.

దిశ, లింగంపేట : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో సోమవారం మృగశిర కార్తె సందడి నెలకొంది. మృగశిర కార్తె ప్రవేశంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండటంతో, మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చేపలను కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. లింగంపేట మండలంలోని భవాని పేట పట్నం చెరువులో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అందరికీ చేపలు అందే విధంగా గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని క్యూ లైన్లలో నిలబెట్టి చేపలను విక్రయించారు.
అధిక ధరలకు చేపల విక్రయం..
మృగశిర కార్తె రోజున చేపలు తినడం సంప్రదాయంగా వస్తుండటంతో మత్స్యకారులు చేపల ధరలను పెంచి విక్రయించారు. గ్యాస్కట్, రవట, బొచ్చ, ఆలుక రకాల తెల్ల చేపలను సాధారణ రోజుల్లో కిలోకు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తుండగా, మృగశిర కార్తె సందర్భంగా కిలోకు రూ.200 చొప్పున విక్రయించారు. అదేవిధంగా మొట్ట చేపలను సాధారణంగా కిలోకు రూ.350 చొప్పున విక్రయిస్తుండగా, మృగశిర కార్తె సందర్భంగా కిలోకు రూ.450కు విక్రయించారు. ధరలు పెరిగినప్పటికీ చేపలను కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు.






