రేపు ఉప్పల్ స్టేడియంలో టీజీ 20 ఫైనల్ మ్యాచ్

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-11 14:11:49  IST  )

తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది.

రేపు ఉప్పల్ స్టేడియంలో టీజీ 20  ఫైనల్ మ్యాచ్
X

దిశ,ఉప్పల్: తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. రేపు(జులై 12) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో హైదరాబాద్ ఛాంపియన్స్, ఖమ్మం ఏసెస్ జట్లు తొలి టీజీ20 టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ రెండు జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీని కైవసం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. గ్రాండ్ ఫైనల్‌కు ముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ జీవన్ రెడ్డి, ట్రెజరర్ అనిల్, టీజీ20 కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విజేత జట్టుకు రూ.1 కోటి నగదు బహుమతి, రన్నరప్‌కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందజేయనున్నట్లు తెలిపారు.

అలాగే సెమీఫైనల్స్ వరకు చేరిన మరో రెండు జట్లకు ప్రోత్సాహకరంగా రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. టీజీ20 యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసే అద్భుత వేదికగా నిలిచిందని, ఇందులో రాణించిన ఆటగాళ్లకు భవిష్యత్తులో ఐపీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక లీగ్‌లలో అవకాశాలు దక్కే అవకాశం ఉందన్నారు. టోర్నీ అంతటా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశంసిస్తూ, ఫైనల్‌లో ఇరు జట్లు అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను అందించాలని ఆకాంక్షించారు. ఫైనల్‌కు ముందు హైదరాబాద్ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరత్, ఖమ్మం ఏసర్స్ కెప్టెన్ సివి మిలింద్ తమ జట్ల విజయం పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. టీజీ20 వంటి టోర్నీలు జిల్లాస్థాయి క్రికెటర్లకు తమ ప్రతిభను చాటుకునే గొప్ప వేదికగా నిలుస్తున్నాయని, తెలంగాణలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. తొలి టీజీ20 ఛాంపియన్‌షిప్ ట్రోఫీని గెలుచుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Next Story