ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి...

by Taduka Kalyani |

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర రాజనర్సింహ అన్నారు

ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా  పూర్తి చేయండి...
X

దిశ, ఆందోల్: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ ) కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం చౌటకూరు, పుల్కల్, జోగిపేట మున్సిపాలిటీ, ఆందోల్, అల్లాదుర్గ్, వట్ పల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు, సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయన బూత్ లెవల్ ఏజెంట్లను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారాలను సరైన విధంగా పూరించడంలో ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని బీఎల్ఏ లకు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అలసత్వం లేకుండా బూతుల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఓటర్లతో, బూత్ లెవెల్ అధికారులకు (బిఎల్ఓ) సహకారం అందించాలని, ఫారాల సేకరణలో సమన్వయ చేసుకొని గడువులోగా (జూలై -24) ప్రక్రియను పూర్తి చేసి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయాల్సి ఉన్నందున ప్రతి ఒక్క ఏజెంట్, ముఖ్య కార్యకర్తలు బూతుల వారిగా ఓటర్లతో సమన్వయం చేసుకొని సహకరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆందోల్ నియోజకవర్గం లో వంద శాతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం విజయవంతం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ BLA లు కృషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు డా . రాజీవ్, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ చిట్టిబాబు, సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story