గులాబీ శ్రేణుల్లో గందరగోళం.. ఉగాది తర్వాత యాక్షన్‌ప్లాన్ పై ఉత్కంఠ

by Disha Web Desk 2 |
గులాబీ శ్రేణుల్లో గందరగోళం.. ఉగాది తర్వాత యాక్షన్‌ప్లాన్ పై ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది. కేవలం తీర్మాణాలతోనే సరిపుచ్చుతుందా? అనేది చర్చనీయాశంగా మారగా, మరో పక్కా ఉగాది తర్వాత యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొనడంపై శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రమే టార్గెట్‌గా ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధించిన అధికారపార్టీ.. మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఒత్తిడి పెంచే ప్రణాళికలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. రైతుల దృష్టిని ఆకర్షించే యత్నం చేస్తోంది.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తూ యాసంగి పంటనంతా కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే కేంద్రానికి లేఖలు రాస్తూనే మరోపక్క మంత్రులు, ఎంపీలు కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 31వరకు కార్యాచరణ చేపట్టింది అధికారపార్టీ. అయితే కేవలం తీర్మానాలే ఉండటం, రైతులకు స్పష్టమైన భరోసాను ప్రభుత్వం ఇవ్వకపోవడం, కేంద్రమే కొనుగోలు చేయాలని ప్రకటనలు చేస్తుండటంతో పార్టీ శ్రేణులపై గ్రామస్థాయిలో రైతుల ఒత్తిడి పెరుగుతోంది. బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు ఏం చెప్పాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉగాది తర్వాత యాక్షన్ ప్లాన్‌పై ఉత్కంఠ నెలకొంది.

రైతుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండేలా.. కేంద్రంతోనే ధాన్యం కొనుగోలు సమస్య తలెత్తిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు స్కెచ్ వేసింది. రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీ వాళ్ల ఉనికి క్లోజ్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని ప్రజలకు వివరించనున్నారు గులాబీ శ్రేణులు. ధాన్యం సేకరణలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరు తెలంగాణను అవమాన పరిచేలా ఉందని, నూకలు ప్రజలకు అలవాటు చేయాలని పేర్కొనడం దారుణమని ఈ విషయాన్ని గట్టిగా తీసుకెళ్లాలని కేసీఆర్ సైతం మంత్రులకు ఇప్పటికే సూచించారు. అదే విధంగా జిల్లా మంత్రులు సైతం జిల్లాల్లో విస్తృత ప్రచారం చేయాలని నిరసనలతో కేంద్రం తీరును ప్రజలకు వివరించేలా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ బీజేపీయే టార్గెట్‌గా చేసుకొని ప్రజల దృష్టిని మరలించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

ఇతర పార్టీల మద్దతుపై కసరత్తు

ధాన్యం పోరులో ఇతర పార్టీల మద్దతుపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. కలిసొచ్చే సంఘాలు, పార్టీలతో పార్టీ నేతలు భేటీ కావాలని సూచించినట్లు సమాచారం. రైతులను కూడా భాగస్వాములను చేసి ఢిల్లీలో ఉద్యమిద్దామనే ప్రయత్నాల్లో గులాబీ నేత ప్రణాళికలు రూపొందస్తున్నట్లు సమాచారం. కేంద్రంతో ఇక చర్చలు, వినతులు అవసరం లేదని, వివక్షను ఎండగడదామని పార్టీ నేతలకు సూచించిన అధినేత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రం అవలంభిస్తున్న వివక్షను, ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా పార్టీ శ్రేణులకు ఉగాది తర్వాత కార్యాచరణ ఇవ్వనున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలే లక్ష్యంగా అధికార పార్టీ ముందుకు సాగనున్నట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రికి పరిజ్ఞానం లేదని, కనీసం ఉద్యమంలో కలిసి రావడం లేదని బద్నాం చేసి పార్టీని బలోపేతం చేసేలా ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం.

బాస్ ఆదేశాల మేరకే ప్రెస్ మీట్లు!

గులాబీ అధినేత ఏది చెబితే అదే పార్టీ శ్రేణులకు వేదం. ధాన్యం కొనుగోళ్లపై అధినేత ఇచ్చిన స్క్రిప్టు తప్ప తాము ఏం చేస్తామనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. బాయిల్డ్ రైస్ విషయంలో సంతకాలతో కూడిన లేఖపై ఎలాంటి ప్రస్తావన లేదు. కేంద్రం ఒత్తిడి చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందని, లేటర్‌ను సైతం కేంద్ర ప్రభుత్వమే తయారు చేసిందని, వానాకాలం పంటను కొనుగోలు చేయాలని రైతులకు నష్టం జరుగొద్దని సంతకాలు చేశామని శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు స్పష్టం చేశారు. ఒక పక్క అలా మాట్లాడుతూ.. మరో పక్క పార్ బాయిల్డు రైస్ కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఉద్యమ బాట చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లోనే గందరగోళం నెలకొంది. వానాకాలం నుంచి ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, కేవలం కేంద్రమే టార్గెట్‌గా ఉద్యమ కార్యచరణ చేపట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే అధినేత కేసీఆర్ కొనుగోళ్లపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే వెళ్లడం, అక్కడ రెండుమూడ్రోజులు వెయింటింగ్ చేయడంతో ఒకరినో ఇద్దరితో కలిసి రావడం పరిపాటిగా మారిందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంతేగాకుండా ప్రెస్‌మీట్లు పెట్టాలని సూచించినప్పుడు పెట్టడం, ఏం మాట్లాడాలో కూడా అధినేతే చెప్పడం.. అంతకు మించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం, అసలు మంత్రులకే కార్యచరణ తెలియకపోవడం శోఛనీయం. ఏదీ ఏమైనప్పటికీ వడ్ల రాజకీయం ఎవరికి కలిసివస్తుందో? ఎవరికి నష్టం చేకూరుస్తుందో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed