కేసీఆరే కాదు.. నేనూ తెలంగాణ జాతిపితనే: మంత్రి

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆరే కాదు.. నేనూ తెలంగాణ జాతిపితనే: మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండలో పర్యటించిన కోమటిరెడ్డి.. అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాణత్యాగం చేసిన అమరులే జాతిపితలు అని అన్నారు. తెలంగాణ దేవత సోనియా గాంధీ అని ప్రకటించారు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే.. నేనూ జాతిపితనే అన్నారు. తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించా, పదవులకు రాజీనామాలు చేసి సర్వం కోల్పోయా అని గుర్తుచేశారు. కేసీఆర్, కోమటిరెడ్డిలు ఎన్నటికీ జాతిపితలు కాలేరని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్‌కు పరాభవం తప్పదు. సర్పంచ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిందే మళ్లీ రిపీట్ కాబోతోందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 5 కార్పొరేషన్లు, 90 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం.. నల్లగొండ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


నేను రేషన్ బియ్యమే తింటా

ఇప్పటికే నల్లగొండ నియోజకవర్గంలో పేదలకు 1000 ఇళ్లు కట్టించామని, దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందించే సన్నబియ్యం పేదలకు ఇష్టంగా తింటున్నారని చెప్పారు. తాను, సీఎం రేవంత్ కూడా అవే బియ్యం తింటున్నట్లుగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యం తిన లేకపోవడంతో పక్కదారి పట్టించేవారని గుర్తుచేశారు.

Next Story