నేడు భద్రాచలానికి గవర్నర్.. ఎలా వెళ్లనుందో తెలుసా?

by Disha Web Desk 2 |
నేడు భద్రాచలానికి గవర్నర్.. ఎలా వెళ్లనుందో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆదివారం భద్రాచలానికి వెళ్ళనున్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు రైలులో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డుమార్గం గుండా ఆలయానికి వెళ్ళనున్నట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణలో తాను ఎక్కడికి వెళ్ళినా రైలు, రోడ్డే తప్ప విమానం, హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాదని మూడు రోజుల క్రితం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఆ ప్రకారమే రైలు, రోడ్డుమార్గం గుండా భద్రాచలం ఆలయానికి వెళ్తున్నారు. రాములోరి కల్యాణోత్సవానికి హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూసుకుంట ఆదివాసీ గ్రామాన్ని కూడా సందర్శించి అక్కడి స్థానికులతో ముచ్చటించాలనే కార్యక్రమం కూడా ఫిక్స్ అయింది.

ఇటీవల యాదాద్రి ఆలయానికి వెళ్ళినప్పుడు తగిన ప్రోటోకాల్ లభించలేదని, ఎగ్జిక్యూటివ్ అధికారి కూడా హాజరుకాలేదని ఢిల్లీలో మీడియాకు వివరించారు. ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోభద్రాచలం ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్‌కు ఎలాంటి ప్రోటోకాల్ లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నందున రాములోరి కల్యాణోత్సవానికి ఆయన హాజరయ్యే అవకాశం లేదు.

రాష్ట్రంలోని ఆదివాసీ, గిరిజన గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన గవర్నర్ అక్కడి అభివృద్ధి పనులపై చొరవ తీసుకుంటున్నారు. పిల్లల చదువులు, మహిళల ఆరోగ్యం తదితరాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆరు చెంచు గ్రామాలను దత్తత తీసుకున్న ఆమె ఆదివాసీ మహిళలకు పౌష్ఠికాహారాన్ని అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు భద్రాచలం టూర్ సందర్భంగా పూసుకుంట గ్రామాన్ని సందర్శించనున్నారు.



Next Story

Most Viewed