తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మీడియా అక్రిడిటేషన్ నిబంధనల్లో సవరణలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 10:43:08  IST  )

తెలంగాణ ప్రభుత్వం తాజగా మీడియా అక్రిడిటేషన్ రూల్స్- 2025లో పలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జోవో నెం.103ను విడుదల చేసింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మీడియా అక్రిడిటేషన్ నిబంధనల్లో సవరణలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ రూల్స్- 2025లో పలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరికొన్ని నిబంధనలల్లో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల విభాగంలో కనీసం 33 శాతం మహిళలకు అవకాశం కల్పించడాన్ని తప్పనిసరి చేసింది. అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు, 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో అదనంగా ఒక అక్రిడిటేషన్ కార్డు కేటాయించనున్నారు. 2.5 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ఒక్కో అదనపు అక్రిడిటేషన్ కార్డును సర్కార్ మంజూరు చేసింది. అదేవిధంగా 75 వేల నుంచి 2.5 లక్షల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో ఏదో ఒకదానిలో రాష్ట్ర స్థాయిలో ఒక అదనపు కార్డును ఇవ్వనున్నారు.

రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధితో పాటు పెద్ద దినపత్రికల నుంచి ఒక డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధిని కొత్తగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించనున్నారు. ఇకపై అక్రిడిటేషన్ నిబంధనల్లో ఎక్కడ ‘మీడియా కార్డు’ అని ఉన్నా దానిని ‘అక్రిడిటేషన్ కార్డు’గానే పరిగణించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న ‘ఉర్దూ బిగ్ న్యూస్ పేపర్’ అనే పదాన్ని ‘ఉర్దూ డైలీ న్యూస్ పేపర్’గా మారుస్తూ సవరణ చేశారు. ఈ సవరణల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌ సీహెచ్ ప్రియాంకకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

Read More... జర్నలిస్టులకు మరో బిగ్ షాక్.. సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ



Next Story