తెలంగాణ బీజేపీ అగ్రనేతలకు సంఘ్ ప్రతినిధుల ప్రశ్నల వర్షం!

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో బీజేపీ-ఆర్ఎస్ఎస్ హాట్ హాట్ భేటీ.. 2028 ఎన్నికల ప్లాన్‌పై కమలం నేతలకు ప్రశ్నల వర్షం.. రంగంలోకి బెంగాల్ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్!

తెలంగాణ బీజేపీ అగ్రనేతలకు సంఘ్ ప్రతినిధుల ప్రశ్నల వర్షం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కీలక సమావేశం హాట్​హాట్​గా సాగిందని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఇప్పటి నుంచే ఉన్న ప్లాన్ ఏమిటో చెప్పాలని ఆర్ఎస్ఎస్​ప్రశ్నించినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు, పార్టీకి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు, పార్టీ భావజాలాన్ని ఏ విధంగా పార్టీ కేడర్, ప్రజల్లోకి తీసుకుపోతారని లేవనెత్తినట్టు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రులు కిషన్​రెడ్డి, బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్, ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్​బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు, ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్ చంద్రశేఖరన్, ఆర్ఎస్ఎస్​కీలక నేత అరుణ్​కుమార్​సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారు. సహజంగా ఆర్ఎస్ఎస్​సమావేశాలకు బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారిలో కీలకమైన వారిని మాత్రమే పిలుస్తుంటారు. కానీ ఈ సారి అందుకు భిన్నంగా భేటీకి జాతీయ పార్టీ కమిటీలో ఉన్న డీకే అరుణ, ఈటల రాజేందర్​ను పిలిచినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో బీజేపీని 2028 ఎన్నికల్లో ఏ విధంగా అధికారంలోకి తీసుకరావాలని, అందుకు ప్రణాళిక గురించి చర్చించినట్లు సమాచారం.

ఫోకస్ పెడితే ఫలితాలు!

జి.కిషన్​రెడ్డి, రాంచందర్​రావు ప్రణాళికలు వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రజల మద్దతు కూడా పెరుగుతుందని వివరించినట్లు తెలిసింది. పార్టీ కేడర్​సైతం కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు. అయితే వారిచ్చిన సమాధానంపై ఆర్ఎస్ఎస్​నేతలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయలేదని తెలిసింది. పార్టీ కార్యక్రమాలు ఇంకా వేగం పెరగాల్సి ఉందని, గతంలో కంటే కొంతకాలం పార్టీ కార్యక్రమాలు పెరిగినా ఇంకా పెరగాల్సి ఉందని, అదే సమయంలో పార్టీలో చేరికలు జరగాలని, అప్పుడే ప్రజలు, పార్టీ కేడర్​లో విశ్వాసం పెరుగుతుందని, దీంతో నాయకులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని సూచించినట్లు తెలిసింది.

పార్టీ ఎంత బలంగా ఉన్నా బలమైన అభ్యర్థులూ అవసరమని సూచించినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే విషయాలపై ఇప్పటి నుంచే ఫోకస్​పెడితే మంచి ఫలితాలు వస్తాయని సలహా ఇచ్చినట్టు తెలిసింది. అదే సమయంలో పార్టీ నాయకుల మధ్య వివాదాల్లోకి ఆర్ఎస్ఎస్​ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విధానం సరికాదని చెప్పినట్లు సమాచారం. పార్టీ నాయకులు అంతర్గత విబేధాలు ఉంటే మీరు సరిచేసుకోవాలని, కానీ తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మళ్లీ సునీల్​బన్సల్ ​రాక

బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, స్టేట్ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ శుక్రవారం వచ్చారు. ఆయన కొంత కాలంగా రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు చాలాకాలం తర్వాత స్టేట్ ఆఫీసుకు రావడం ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఇన్ చార్జ్‌గా సునీల్ బన్సల్ పనిచేశారు. ఇప్పుడు ఆయన రాకతో తర్వాతి టార్గెట్ తెలంగాణే అని కమలం నేతలు అంటున్నారు. బెంగాల్​లో ఆయనకు అప్పగించిన పనిని పూర్తి చేశారని, ఇప్పుడు రాష్ట్రంలోనూ అప్పగించిన పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన సునీల్ బన్సల్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

Next Story