Teegala Krishna Reddy: మంత్రి సబితకు బిగ్‌షాక్.. తీగల కాంగ్రెస్‌లో చేరికకు మూహుర్తం ఫిక్స్?

by Disha Web Desk 2 |
Teegala Krishna Reddy is likely to join Congress Party
X

దిశ, వెబ్‌డెస్క్: Teegala Krishna Reddy is likely to join Congress Party| మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత ఇలాకాలో రాజకీయ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యర్థుల విమర్శలు ఎలా ఉన్నా సొంత పార్టీలో ఆమెకు వ్యతిరేక పవనాలు వీయడం సంచలనం రేపుతోంది. తీగల చేసిన కామెంట్స్ రచ్చ రేపుతుండగానే రంగంలోకి కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వడం ఉత్కంఠకు దారి తీస్తోంది. నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి అక్రమాలకు ఆస్కారం ఇస్తోందని తీగల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని బహిరంగంగా చేసిన కామెంట్స్ టీఆర్ఎస్ వర్గాల్లో ఉలిక్కిపాటుకు గురి చేశాయి. తీగల కృష్ణారెడ్డి మాటల వెనుక ఉన్నదెవరూ అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగానే కాంగ్రెస్ రంగ ప్రవేశం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

ప్రజాధనం లూటీ చేయడానికే సబితా కంకణం కట్టుకున్నారు:

మంత్రాల చెరువులో వీధి వ్యాపారుల కోసం షాపింగ్ మాల్ నిర్మాణం ఇప్పుడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టు రాజకీయం సాగేలా చేస్తోంది. ఈ షాపింగ్ మాల్ పేరుతో ప్రజల సొమ్మును లూటీ చేసి వాటిని కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా సబితా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిజానికి మంత్రాల చెరువులో షాపింగ్ మాల్ నిర్మించాలనుకుంటున్న చోటు చాల చిన్నదని కాంగ్రెస్ చెబుతోంది. తాము ప్రతిపాదించే స్థలంలో నిర్మాణం చేపడితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని సూచిస్తోంది. తన అనుచర గణానికి, కార్పొరేటర్లకు లబ్ధి చేకూరేలా మంత్రి సబితా వ్యవహిరస్తున్నారని, అందు కోసమే ఎఫ్ టీఎల్ ప్రాంతంలో మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మాల్ నిర్మించే ప్రాంతంలో హై టెన్షన్ వైర్లు ఉన్నాయని.. అలాంటప్పుడు నిర్మాణాలు ఎలా చేపడతారని ఈ విషయంలో అధికారులకైనా కనీసం అలోచన లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. మంత్రి ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

తీగల క్లారిటీ ఇచ్చినా ఆగని ప్రచారం:

ఇన్నాళ్లు రాజకీయంగా మౌనంగా ఉన్న తీగల కృష్ణారెడ్డి ఒక్క సారిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆమె చెరువులను కబ్జా చేస్తూ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారని, సూళ్లని కూడా కమర్షియల్‌ బిల్డింగ్‌లుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. మీర్‌పేట నియోజకవర్గమంతా అపరిశుభత్రతో ఉంటోందన్నారు. ఎక్కడ చూసిన చెత్తాచెదారం, నిర్మాణానికి నోచుకోని రోడ్లతో అస్తవ్యస్థంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తీగల వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీమారే ఆలోచనతోనే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనే కథనాలు వెలువడ్డాయి. వీటిపై స్పందించిన తీగల.. ఇష్టం లేకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటాను అంతే కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే సబితాపై తీగల ఆరోపణలు చేసిన తర్వాత కాంగ్రెస్ సైతం అవే అంశాలపై పోరాటం చేయడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రి సబితా ఇలాకాలో టీఆర్ఎస్‌లో చెలరేగిన రాజకీయ దుమారం కాంగ్రెస్ నేతల రంగ ప్రవేశంతో ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్న వారి జాబితా ఇదే నంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో తీగల కృష్ణారెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. తాను పార్టీ మారే ఉద్దేశంలో లేను అని ప్రకటించినప్పటికీ ఈ నెల 11న కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి తీగల మూహుర్తం ఫిక్స్ చేసుకున్నారనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.


Next Story