కేసీఆర్ అబద్దాల చక్రవర్తి: టీడీపీ లీడర్

by Web Desk |
కేసీఆర్ అబద్దాల చక్రవర్తి: టీడీపీ లీడర్
X

దిశ, ముషీరాబాద్: కేసీఆర్ ఒక పెద్ద జూఠాకోర్, అబద్దాల చక్రవర్తి అని గ్రహించే రోజు త్వరలో వస్తుందని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. గురువారం కవాడిగూడ లోని టిడిపి నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదిన జాతర తెలంగాణ అభివృద్ధికి పాతర అన్న చందంగా ఉందన్నారు.

వందల మంది యువకుల ప్రాణాలు బలిపెట్టి సాధించుకున్న త్యాగాల తెలంగాణ లో ఎనిమిదేళ్ల మీ పాలనలో సాధించిన ప్రగతి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టడమే అని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియమకాలు అంటూ తారక మంత్రం వల్లిస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతూ మీరు సాధించిన ఘన విజయాలేమిటని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో పుట్టిన రోజు జాతరలు జరుపుకోవడం.. ప్రజాస్వామ్యానికి తిలోదకాలని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, సంపన్న రాష్ట్రాల్లో తెలంగాణా నెంబర్ వన్ అని ప్రచారం చేసుకుంటూ ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసినందుకా ఈ సంబరాలు అని ప్రశ్నించారు. దళిత బంధు పేరుతో దళిత సోదరులను వంచించినందుకా ఈ సంబరాల అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీ జన్మదినం పేరుతో ప్రజల నుండి దోపిడీ చేసిన డబ్బుతో మీరు మీ ప్రజా ప్రతినిధులు సంబరాలు చేస్తుంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి బాలరాజ్ గౌడ్, యాదగిరి రావు, ప్రకాష్, రవీంద్ర చారి, వెంకటేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


Next Story