రెబ్బెనలో ఓటరు సర్వేపై తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

by Batti.Sumithra |   (  Updated:2026-07-01 12:51:10  IST  )

రెబ్బెన మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేను తహసీల్దార్ సూర్యప్రకాశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రెబ్బెనలో ఓటరు సర్వేపై తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేను తహసీల్దార్ సూర్యప్రకాశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి సర్వే పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి, నిబంధనల ప్రకారం వివరాలను నమోదు చేయాలని సూచించారు.

ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించి, నిర్ణీత గడువులోపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ బుధవారం నాటికి మండలంలో 28 వేల ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేయగా, మొత్తం 1,820 ఫారాలు తిరిగి అందినట్లు తెలిపారు. మిగిలిన ఫారాలను కూడా త్వరితగతిన సేకరించి సర్వేను విజయవంతం చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. ఓటర్లు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసి సంబంధిత బీఎల్‌వోలకు ఫారాలను అందజేసి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వో సూపర్వైజర్ ఉదయ్ కిరణ్, బీఎల్‌వోలు, జీపీవోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story