భారీ వర్షాలు.. నీట మునిగిన స్మశాన వాటిక.. కొట్టుకు పోయిన మృతదేహాలు

by Muthe.Rajitha |

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహ్రాన్‌పూర్‌లో వరదల తీవ్రతకు గగల్‌హేరి ప్రాంతంలోని ఒక శ్మశానవాటిక నీట మునిగి, మృతదేహాలు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు.. నీట మునిగిన స్మశాన వాటిక.. కొట్టుకు పోయిన మృతదేహాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి రహదారులు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహ్రాన్‌పూర్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వరదల తీవ్రతకు గగల్‌హేరి ప్రాంతంలోని ఒక శ్మశానవాటిక నీట మునిగి, మృతదేహాలు కొట్టుకుపోయిన వైనం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వరద ఉధృతి.. కొట్టుకుపోయిన డెడ్ బాడీస్

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గగల్‌హేరి ప్రాంతంలోని శ్మశానవాటిక పూర్తిగా జలమయమైంది. వరద నీటి ఉధృతికి సమాధులపై ఉన్న మట్టి క్రమంగా కోతకు గురైంది. మట్టి కొట్టుకుపోవడంతో, అక్కడ ఖననం చేసిన మృతదేహాల్లో కొన్ని పైకి తేలి, వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. తమ ఆత్మీయుల మృతదేహాలు ఇలా బయటపడటాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

మృతదేహాలు ఏమయ్యాయంటే?

విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అప్రమత్తమయ్యారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న మృతదేహాలను ఎంతో కష్టపడి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత వరద నీరు తగ్గుముఖం పట్టే వరకు వేచి చూసి, తిరిగి ఆ మృతదేహాలను గౌరవప్రదంగా ఖననం చేశారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story