కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర విద్యాశాఖ ఆశలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-21 03:41:07  IST  )

ఎడ్యుకేషన్ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్’ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది.

కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర విద్యాశాఖ ఆశలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎడ్యుకేషన్ హబ్‌గా పేరు గాంచిన హైదరాబాద్‌లో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్’ (Indian Institute of Management)లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐఐఎంను రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడమే కాకుండా... సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కేంద్రమంత్రులను కలిశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి సహకారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో దశాబ్దాలుగా ఊరిస్తున్న ఐఐఎం (IIM) ఈసారైనా హైదరాబాద్‌కు మంజూరవుతుందా లేదా అన్నది రాష్ట్ర విద్యా శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా 21 ఐఐఎంలు ఉన్నాయి. దీంతో ఎడ్యుకేషన్ హబ్ అయిన హైదరాబాద్ కు సైతం ఐఐఎం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, ప్రస్తుతం తెలంగాణలో కొత్త ఐఐఎం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర విద్యా శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరుతోంది.

హెచ్ సీయూలో 200 ఎకరాలు!

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులను కలిశారు. రూ. 30 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్) నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఎఫ్ఆర్ బీఎం పరిమితి నుంచి మినహాయించాలని విన్నవించారు. కొత్తగా ఐఐఎం తో పాటు, జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల సంఖ్యను పెంచాలని కోరారు. హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు ఐఐఎం వంటి సంస్థ అవసరం ఎంతో ఉందని విజ్ఞప్తి చేశారు. కాగా, ఐఐఎం ఏర్పాటు కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇప్పటికే 200 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం.

కేంద్రీయ విద్యాలయాల కోసం ఎదురుచూపులు

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9 కేంద్రీయ, 16 జవహర్ నవోదయ విద్యాలయాల ప్రతిపాదనలు పెం డింగ్‌లో ఉన్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో తక్షణమే కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించాలని రాష్ట్రం కోరుతున్నది.

కేంద్రంపై ఆశలు

గతేడాది తెలంగాణకు నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర అవసరాలకు అవి ఏమాత్రం సరిపోవని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న ప్రకటించబోయే పద్దులో విద్యా రంగంలో తెలంగాణకు పెద్దపీట వేస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఐఐఎం మంజూరైతే, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గొప్ప విద్యా కేంద్రంగా అవతరిస్తుందని చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి కేంద్రం కేటాయించే నిధులు, రాష్ట్రాల వారీగా ఇచ్చే కొత్త సంస్థల జాబితాపై ఫిబ్రవరి 1న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read More..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్

Next Story