'తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారింది'

by Disha Web Desk 2 |
తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారింది
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రైతు కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే దేశంలో ఏ పంట ఎంత అవసరం అన్న ప్రణాళిక ఉండాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కానీ, కేంద్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దేశాన్ని పంట కాలనీలుగా విభజించి పంటల సాగుకు మార్గదర్శనం చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు న్యాయం జరిగేలా ఉండాలని, రైతుకు ఎంత చేసినా తక్కువే అని వ్యాఖ్యానించారు. పంటల మార్కెటింగ్, ఎగుమతుల విషయంలో రైతుకు సాయం చేయాల్సిన కేంద్రం చేటు చేస్తున్నదని విమర్శించారు. భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. యువత వ్యవసాయంలో తమదైన ముద్ర వేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ఇస్తూ వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు, కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయ స్వరూపం సమూలంగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు.

పంటల మార్పిడితో రైతులు లాభాలు గడించాలన్నది మా ఉద్దేశమని తెలిపారు. తెలంగాణలో పంట మార్పిడి కోసం ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పర్యటించామని అన్నారు. శుక్రవారం వ్యవసాయ, ఉద్యాన పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలనకు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అహ్మద్ నగర్ జిల్లా శిరిడీ సమీపంలో ద్రాక్ష, జామ తోటలు పరిశీలించారు. స్థానిక వ్యవసాయ, ఉద్యాన అధికారులు, రైతులతో సమావేశమైన నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉద్యానశాఖ జేడీ సరోజినిదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed