ఆసియా కప్ 2022 డేట్ ఫిక్స్.. శ్రీలంక వేదికగా టోర్నమెంట్

by Disha Web |
ఆసియా కప్ 2022 డేట్ ఫిక్స్.. శ్రీలంక వేదికగా టోర్నమెంట్
X

కొలంబో : టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్‌ను ఈ ఏడాది శ్రీలంకలో నిర్వహిస్తున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించింది. కొలంబోలో శనివారం నిర్వహించిన ఏసీసీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 27 నుంచి టోర్నీ ప్రారంభమై.. సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 20 నుంచి క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 2018లో చివరిసారిగా వన్డే ఫార్మాట్‌లో నిర్వహించిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన టీమ్ ఇండియా 7వ సారి ఆసియా కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. తిరిగి 2020లో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా 2021కి, ఆ తర్వాత 2022కి వాయిదా పడింది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 2016లో మాత్రమే ఆసియా కప్ నిర్వహించగా.. ఇది రెండోది.

ఏసీసీ ప్రెసిడెంట్‌గా జై షా పదవీకాలం పొడిగింపు

ఏసీసీ ప్రెసిడెంట్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా 2024 వరకు కొనసాగనున్నారు. ఏసీసీ మీటింగ్‌లో జై షా పదవీకాలాన్ని పొడిగించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. గతేడాది జనవరిలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ నుంచి జై షా ఏసీసీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. 'ఆసియా రీజన్‌లో క్రికెట్‌ను మరింత ప్రోత్సహించడంతోపాటు ఏసీసీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. ముఖ్యంగా మహిళల క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఏడాది మొత్తం ఏసీసీ టోర్నమెంట్‌లు నిర్వహించడానికి కృషి చేస్తాను' అని జై షా తెలిపారు.



Next Story

Most Viewed