ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా ‘సమతాకుంభ్‌-2026’ ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-31 03:37:09  IST  )

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో వెలసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.

ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక వైభవం.. అట్టహాసంగా ‘సమతాకుంభ్‌-2026’ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ (Muchintal) శ్రీరామనగరంలో వెలసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. త్రిదండి చినజీయర్ స్వామి (Tridandi Chinna Jeeyar Swami) వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీరామానుజాచార్య (Sri Ramanujacharya) 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు సమతాకుంభ్‌-2026 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం సాకేత రామాలయం, సమతామూర్తి ప్రాంగణంలో వేదమంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అనంతరం హోమశాలలో ఏర్పాటు చేసిన 9 అగ్నికుండాల్లో అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాన్ని రుత్వికులు అత్యంత నిష్ఠతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా లోకకల్యాణార్థం సామూహిక శ్రీరామ అష్టోత్తర శతనామార్చనలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో సంతానం లేని దంపతుల కోసం గరుడ ప్రసాదం వితరణ చేశారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.

వైభవోపేతంగా వాహన సేవలు..

ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం భానుడి వెలుగుల సాక్షిగా సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. సాయంత్రం సాకేత రామచంద్రప్రభువు శేషవాహనం (Shesha Vahanam)పై భక్తులకు అభయమివ్వనున్నారు. ఇక రాత్రి 18 దివ్యదేశ మూర్తులకు కనువిందుగా గరుడ సేవలు నిర్వహించనున్నారు. ఏక కాలంలో 18 గరుడ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఈసారి ఉత్సవాల్లో శ్రీగోదాదేవి అమ్మవారు 1000 వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జనవరి 30న అంకురార్పణతో మొదలైన ఈ సమతాకుంభ్‌ వేడుకలు ఫిబ్రవరి 9 వరకు నిరంతరాయంగా కొనసాగనున్నాయి.

Next Story