విశాఖ జూలో డాక్టర్లు, నిధుల కొరతపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆందోళన

by Malleboina Mahesh |

విశాఖ జూలో 1404 జంతువులకు ఒక్కడే డాక్టర్.. ఖాళీల భర్తీ, టీటీడీ లాంటి సంస్థల నుంచి నిధుల సమీకరణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

విశాఖ జూలో డాక్టర్లు, నిధుల కొరతపై  స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. విశాఖపట్నంలో జరిగిన వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో జూ పార్కుల అభివృద్ధి, అడవుల సంరక్షణతో పాటు వన్యప్రాణుల రక్షణ చట్టాల సంస్కరణలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.

డాక్టర్లు, నిధుల కొరతపై ఆందోళన

రాష్ట్రంలోని జూ పార్కుల నిర్వహణకు ఏటా కనీసం రూ. 10 కోట్ల నిధులు అవసరమని ఈ భేటీలో కమిటీ స్పష్టం చేసింది. అయితే వన్యప్రాణుల సంరక్షణ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ముఖ్యంగా విశాఖ జూ లో ఉన్న 1404 జంతువుల సంరక్షణకు కేవలం ఒక్కడే పశువైద్యుడు (Veterinary Doctor) ఉండటంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. జూలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే వన్యప్రాణుల రక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రతి ఒక్కరూ ఒక కర్తవ్యంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. జంతువుల సంరక్షణ, జూ పార్కుల నిర్వహణ కోసం బడ్జెట్ కొరత రాకుండా ఉండేందుకు టీటీడీ (TTD) వంటి ధనిక, స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు, నిధుల సమీకరణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Next Story