పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్పీ సింధూశర్మ

by Disha Web Desk 2 |
పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్పీ సింధూశర్మ
X

దిశ, జగిత్యాల టౌన్: త్వరలో పోలీస్ శాఖలో భర్తీ కానున్న 18,334 వేల ఉద్యోగాలకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ఉంటుందని, శిక్షణకు సంబధించిన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ సింధూశర్మ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా పెట్టాలని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. భూతగాదాల విషయంలో నేరాలు చేసేవారిని గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రకాష్, రవీందర్ రెడ్డి, ఏవో చంద్ర మోహన్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దుర్గ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సీఐలు, కృష్ణకుమార్, కిషోర్, కోటేశ్వర్, శ్రీను డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed