సారా తయారీకి పట్టిక అక్రమ రవాణా.. 100 కిలోల పట్టిక స్వాధీనం

by Ratna Kumari |   (  Updated:2026-07-03 15:53:44  IST  )

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సారా తయారీ కోసం అక్రమంగా పటిక (అలమ్) సరఫరా చేస్తున్న ముఠాపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 100 కిలోల పటికతో పాటు మారుతి ఇగ్నిస్ కారును స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.

సారా తయారీకి పట్టిక అక్రమ రవాణా.. 100 కిలోల పట్టిక స్వాధీనం
X

దిశ, హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో సారా తయారీ కోసం అక్రమంగా పటిక (అలమ్) సరఫరా చేస్తున్న ముఠాపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 100 కిలోల పటికతో పాటు మారుతి ఇగ్నిస్ కారును స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. సీఐ వివరాల ప్రకారం.. కొత్తతండా ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి సారా తయారీ కోసం పటిక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేని మారుతి ఇగ్నిస్ కారు ఆగకుండా వేగంగా వెళ్లిపోవడంతో అధికారులు దానిపై నిఘా ఉంచారు.

అదే వాహనం అర్ధరాత్రి తర్వాత సూర్యాపేట నుంచి తిరిగి వస్తుందన్న సమాచారంతో గడ్డిపల్లి ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం కారును అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో సుమారు 100 కిలోల పటిక లభించింది.వాహనంలో ఉన్న పాలకీడు మండలం కోమటికుంట గ్రామానికి చెందిన షేక్ రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, కొత్తతండాకు చెందిన బానోతు బాలాజీ (తండ్రి బాబు)తో కలిసి గత నెల రోజులుగా సారా తయారీ కోసం పటిక సరఫరా చేస్తున్నట్లు అంగీకరించినట్లు సీఐ తెలిపారు. షేక్ రియాజ్‌ను అరెస్ట్ చేసి, 100 కిలోల పటికతో పాటు మారుతి ఇగ్నిస్ కారును స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న బానోతు బాలాజీపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టామని ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ జగన్మోహన్ రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది విద్యాసాగర్, గురువయ్య, గోపిరెడ్డి పాల్గొన్నారు.

Next Story