- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Monetisation Scheme: బంగారం నిల్వలపై ప్రభుత్వం కొత్త ప్లాన్
ఇప్పటివరకు కేవలం బ్యాంకులకు మాత్రమే ఉన్న బంగారం సేకరణ పాత్రను ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లకు కూడా విస్తరించనున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)ను పునరుద్ధరించి కొత్త రూపంలో తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి రాబోయే రెండు వారాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రతిపాదిత మార్పుల ప్రకారం, ఇప్పటివరకు కేవలం బ్యాంకులకు మాత్రమే ఉన్న బంగారం సేకరణ పాత్రను ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలర్లకు కూడా విస్తరించనున్నారు. వీరిని ‘సేకరణ భాగస్వాములు(కలెక్షన్ పార్ట్నర్ )’గా చేర్చి ఇళ్లలో నిల్వగా ఉన్న బంగారాన్ని సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మార్గంలో సుమారు 1,000 టన్నులకుపైగా బంగారం సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇళ్లలో దాదాపు 25,000 టన్నుల బంగారం ఉండగా, కేవలం 5 శాతం నగదీకరణ చేసినా దాదాపు 80–90 బిలియన్ డాలర్లు(రూ. 7.6-8.57 లక్షల కోట్ల) లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని పరిశ్రమ వర్గాల అంచనాలు చెబుతున్నాయి.
ఈ ప్రయత్నం వెనుక 2015లో ప్రారంభమైన పాత జీఎంఎస్ పథకమే ప్రధాన కారణం. ఆ పథకం కింద ఇప్పటివరకు కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే సమీకరించారు. బ్యాంకులకు తక్కువ వ్యాపార ప్రోత్సాహం, పన్ను భయాలు, ప్రజల్లో బంగారంపై ఉన్న భావోద్వేగ విలువలు వంటి కారణాలతో స్కీమ్ పెద్దగా విజయవంతం కాలేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా ఉపయోగంలో లేని బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, కరెంట్ అకౌంట్ ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా ఉంది. సైద్ధాంతికంగా చూస్తే, పెద్ద స్థాయిలో బంగారం సమీకరణ జరిగితే దిగుమతులపై డిమాండ్ తగ్గి రూపాయి స్థిరత్వానికి కూడా మద్దతు ఇవ్వగలదని నిపుణులు భావిస్తున్నారు.






