స్మార్ట్‌పోన్‌ ధరలకు భారీగా రెక్కలు

by Muthe.Rajitha |

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి రాబోయే రోజుల్లో భారీ షాక్ తప్పేలా లేదు.

స్మార్ట్‌పోన్‌ ధరలకు భారీగా రెక్కలు
X

దిశ, వెబ్ డెస్క్ : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి రాబోయే రోజుల్లో భారీ షాక్ తప్పేలా లేదు. రానున్న కాలంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయంటూ ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ 'నథింగ్' (Nothing) సీఈఓ కార్ల్ పై (Carl Pei) పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ల తయారీకి అత్యంత కీలకమైన మెమరీ చిప్స్ (RAM & Storage) కొరత విపరీతంగా పెరిగిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.

మెమరీ చిప్స్ ధరలు మూడు రెట్లు పైకే!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఏఐ డేటా సెంటర్లు (AI Data Centers) భారీ ఎత్తున మెమరీ చిప్స్‌ను(DRAM & NAND ఫ్లాష్) కొనుగోలు చేస్తుండటంతో, స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు వీటి సరఫరా తీవ్రంగా తగ్గిపోయింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో కొన్ని రకాల మెమరీ మాడ్యూల్స్ ధరలు ఏకంగా మూడు రెట్ల వరకు పెరిగాయి. గత ఏడాది కేవలం రూ.1,650 గా ఉన్న మెమరీ మాడ్యూల్స్ ధర, ఇప్పుడు ఏకంగా రూ.8,300 దాటిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల సాధారణంగా ఫోన్లలో అత్యంత ఖరీదైన భాగాలుగా భావించే ప్రాసెసర్, డిస్‌ప్లేల కంటే, ఇప్పుడు 'మెమరీ'నే అత్యంత ఖరీదైన భాగంగా మారిపోయింది.

వినియోగదారులపై పడే ప్రభావం ఎలా ఉండబోతోంది?

ధరల పెరుగుదల ప్రభావం ప్రీమియం ఫోన్ల కంటే బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లపైనే ఎక్కువగా ఉండనుంది. భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సగటు ఫోన్ల ధరలు ఇప్పటికే 7.9% వరకు పెరిగాయి. తాజా సంక్షోభం వల్ల మిడ్-రేంజ్ మోడల్స్ ధరలు రాబోయే రోజుల్లో ఏకంగా రూ.10,000 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లోకి రానున్న తమ నథింగ్ బ్రాండ్ ఫోన్ల ధరలను కూడా అనివార్యంగా పెంచాల్సి వస్తుందని కార్ల్ పై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పెరుగుతున్న మెమరీ ధరల భారాన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భరించే పరిస్థితి లేకపోవడంతో, ఆ భారాన్ని నేరుగా వినియోగదారులపైనే వేయక తప్పడం లేదు. ఫలితంగా జూలై తర్వాత విడుదల కాబోయే కొత్త ఫోన్ల ధరలు సామాన్యుడికి మరింత భారాన్ని మిగల్చనున్నాయి.

Next Story