నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ

by Ratna Kumari |   (  Updated:2026-06-24 15:38:02  IST  )

జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు.

నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయి కృష్ణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లినప్పుడు అనుసరించాల్సిన విధానాలు, ఫారాల సమర్పణ ప్రక్రియ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు, ఆన్‌లైన్‌లో ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణ దశలు, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, ఆఫ్‌లైన్ ఫారాల పూర్తి విధానం తదితర అంశాలను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ... ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కోరారు. ఇప్పటికే బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి అధికారులు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బీఎల్‌వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు.

2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ధృవీకరించి నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూలై 24 నుండి 30 వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తప్పు సమాచారం సమర్పించిన సందర్భాల్లో వెంటనే తొలగింపు చేయకుండా, ముసాయిదా జాబితా అనంతరం నోటీసులు జారీ చేసి విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వలస వెళ్లిన, మరణించిన, డూప్లికేట్ ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు ఫారం–8 ద్వారా వివరాల సవరణ చేసుకోవచ్చని అన్నారు. ప్రతిరోజు బీఎల్‌వోలు గరిష్ఠంగా 50 ఫారాల వరకు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసే యువత కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. అనంతరం రాజకీయ నాయకులు పార్టీ ప్రతినిధులకు తలెత్తిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ సూపర్డెంట్ రంగ ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ వెంకటేశ్వర నాయక్, అన్వర్, కాంగ్రెస్ పార్టీ నుండి లక్ష్మణ్ అగర్వాల్, సిపిఐ పార్టీ నుండి అన్నవరపు సత్యనారాయణ, బిజెపి పార్టీ నుండి రవి నాయక్ తదితరులు, ఎన్నికల శాఖ సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story