ఉపాధి హామీ పనుల్లో సిగ్నల్ సంక్షోభం

by Malleboina Mahesh |

ఉపాధి హామీలో కొత్త యాప్ కష్టాలు! నెట్‌వర్క్ లేక మస్టర్ నమోదులో ఇబ్బందులు. వేతనం రాదని కూలీల ఆందోళన.. మేట్లపై స్మార్ట్‌ఫోన్ భారం.

ఉపాధి హామీ పనుల్లో సిగ్నల్ సంక్షోభం
X

‘మా ఊర్లో ఫోన్ మాట్లాడడానికే సిగ్నల్ రావడం లేదు సార్.. ఇక ఫొటో తీసి యాప్‌లో పెడితేనే కూలీ అంటున్నారు. మేమెలా బతుకాలి?’.. ఇది ఒక ఉపాధి కూలీ ఆవేదన. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెంచుతామని, ఫేక్ మస్టర్లకు చెక్ పెడతామని చెబుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ యాప్ విధానం ఇప్పుడు గ్రామాల్లో కొత్త సమస్యలకు దారి తీస్తుంది. కూలీల హాజరును ఇకపై పూర్తిగా ఫోటో ఆధారిత యాప్ ద్వారానే నమోదు చేయాలని తీసుకున్న నిర్ణయం, క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలకు గురవుతున్నది.

దిశ, దౌల్తాబాద్: చాలా గ్రామాల్లో ఇప్పటికీ సరైన మొబైల్ నెట్‌వర్క్ లేదు. పనులు జరిగేది పొలాల్లో, చెరువుల వద్ద. అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే మాస్టర్ ఎలా నమోదు చేస్తారు? సర్వర్ పని చేయకపోతే ఆ రోజు కూలీల వేతనం పోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్.. మేట్లకు కొత్త భారం?

కొత్త రూల్స్ ప్రకారం మేట్ల దగ్గర ఆండ్రాయిడ్ 7 పైగా, కనీసం 2జీబీ స్టోరేజ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ తప్పనిసరి. పేద కుటుంబాలకు చెందిన మేట్లు కొత్త ఫోన్ కొనాల్సి రావడం ఆర్థిక భారం అవుతుంది. అదే సమయంలో ‘పోర్ట్రెయిట్ మోడ్’లో ఫొటోలు తప్పనిసరి చేయడం కూడా ప్రాక్టికల్‌గా కష్టమేనని వారు చెబుతున్నారు.

అక్రమాలకు చెక్ పెట్టేందుకేనా?

ప్రభుత్వ లక్ష్యం పారదర్శకతే అయినా.. టెక్నాలజీని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. ‘ఆఫ్‌లైన్’ పేరుతో తప్పుడు ఫొటోలు అప్‌లోడ్ చేస్తే ఎవరు చెక్ చేస్తారు?సిగ్నల్ సమస్యను సాకుగా చూపి కూలీల డబ్బులు ఆపే ప్రమాదం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, యాప్ తప్పనిసరి అయితే.. సిగ్నల్ ఉన్నచోటే పనులు చేయాలా? సమస్య ఉన్న గ్రామాల్లో మాన్యువల్ మస్టర్‌కు అవకాశం ఇవ్వాలి అని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. సిగ్నల్ లేక మాస్టర్ నమోదు కాకపోతే.. కూలీకి వేతనం రాకపోతే బాధ్యులెవరు? అని పలువురు కూలీలు ప్రశ్నిస్తున్నారు. గ్రామీణ వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గం సర్కార్ సిద్ధం చేసిందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు

Next Story